Thursday 6 November 2014

Sri jagajjananitemple Nandyal

సర్వజగత్తుకు సృష్టికర్త శ్రీజగజ్జననీ అమ్మవారు. సకల చరాచర జగత్తును సృష్టించినటువంటి తొలిదినాల్లో అమ్మవారు భూమండలంలోనే ప్రపంచంలో, భారతదేశంలో, జమ్మూకాశ్మీర్ హిమాలయ పర్వతాల్లో సముద్రమట్టానికి 19,500 అడుగుల ఎత్తులో విరాట్ స్వరూపంతో స్వయంభువుగా వెలసింది. ఈ ఆలయానికి దగ్గరలోనే మానస సరోవరం వుండేది. ఈ సరోవరంలో ముక్కోటి దేవతలందరూ కూడా బ్రాహ్మీ ముహూర్తంలో స్నానమాచరించి అమ్మవారి దర్శనం చేసుకుని వెళ్ళేవారని మన పురాణ గ్రంథాలు మరియు వేదాలు తెలియజేస్తున్నవి. కాపాలికావిథి, పూర్వాచారగాణా పత్యవిథి, వామకేశ్వరతంత్రం, కౌలాచార తంత్రం, శక్తిస్థల్, దేవీ భాగవత పురాణాలు, బ్రహ్మ, విష్ణు, శైవ, బ్రహ్మవైవర్త కార్తికేయ పురాణాల్లో శ్రీ జగజ్జననీ అమ్మవారి గురించి క్షుణ్ణంగా తెలుసుకొనవచ్చును. ఈ అమ్మవారికి భర్త అనేటువంటి శక్తి ఈ సృష్టిలో ఎక్కడా లేదు. తన ఇచ్ఛానుసారము భర్తగాను, భార్యగాను రూపాంతరం చెందుతూ వుంటుంది. తన నుంచి వచ్చిన అంశామూర్తులకే భర్త అనేటువంటి శక్తి వుంటుంది. పార్వతికి శివుడు, లక్ష్మికి విష్ణువు, సరస్వతికి బ్రహ్మ యిత్యాదిగా వుంటారు. ఈ అమ్మవారు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరుతో, ఒక్కొక్క రూపంతో వెలుస్తూంటుంది. కనుక ఈ అమ్మను మహామాయ, యోగమాయ, అదిపరాశక్తి అని కూడా పిలుస్తుంటారు. కాకపోతే జగత్తునంతా సృష్టించినటువంటి తల్లి కాబట్టి జగజ్జనని అనే పేరున ప్రసిద్ధమైంది. ఈ అమ్మవారు హిమాలయాల్లో విరాట్ స్వరూపంతో ఏ విధంగా ఐతే వెలిసిందో ఇప్పుడు మన నంద్యాల పట్టణంలో కలియుగంలో అదే విధంగా వెలసింది. అమ్మవారి కడుపులో పంచముఖశివుడు, పాదపీఠశాయిగా శ్రీ మహావిష్ణువు, మహావిష్ణువు నాభి నుండి పశ్చిమ భాగంలోని క్రింది చేతిలో చతుర్ముఖ బ్రహ్మ వుంటారు.

అమ్మవారి కుడవైపు ఒక చేతిలో చంద్రమండలం, 2వ చేతిలో భూమండలం, 3వ చేతిలో సూర్యమండలం, లక్ష్మి దేవి, అభయ హస్తంలో త్రినేత్రం, త్రిశూలం మరియు ఎడమ వైపు ఒక చేతిలో శంఖు, 2వ చేతిలో ఢమరుకం, 3వ చేతిలో ధనుస్సు, 4వ చేతిలో చతుర్ముఖ బ్రహ్మ వుంటారు.

శ్రీ మాతకు 17 తలల ఆదిశేషుడు పడిగ పట్టి వుంటాడు. సింహం వాహనంగా వుంటుంది. సృష్టికి మూలం తనేనని త్రిమూర్తులు, త్రిమాతలతో సహా ముక్కోటి దేవతలందరూ తమ కార్యకలాపాలను తన వీక్షానుమతితోనే సాగిస్తారని ప్రపంచానికి తెలిపే విరాట్ స్వరూపం జగజ్జనని.

ఈ అమ్మవారికి యిక్కడ ప్రతి రోజు రాహు కాల పూజలు విశేషంగా జరుగును. అమావాస్య, పౌర్ణమి పూజలు విశిష్టంగా జరుగుతాయి. సూర్య గ్రహణము, చంద్ర గ్రహణములలో శ్రీ అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు జరుగును. అమ్మవారి దర్శనార్థమై భక్తాదులు వేల సంఖ్యలో వస్తారు. విశ్వ శాంతి, లోక కళ్యాణం, సర్వ జన శ్రేయస్సిద్ధ్యర్థం మరయు ఈ కలియుగంలో మానవులు వారి ఉజ్జ్వల భవిష్యత్తు కోసం ప్రతి సంవత్సరం ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి కార్తీక పౌర్ణమి వరకు మండల దీక్షలు స్వీకరిస్తారు. స్త్రీలు దసరా పది రోజులలో లేదా కార్తీక పౌర్ణమికి 11 రోజులు మందు మాల ధరించవచ్చును. పురుషులు మాత్రం 40 రోజులు దీక్ష స్వీకరించాలి. ఈ కలియుగంలో మనము మావులుగా సుక్ష్మ రూపంతో జన్మించినాము కాబట్టి మనకు కొన్ని కోరికలు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా వుంటాయి. మన పిల్లలకు చదువులు, ఉద్యోగాలు రావాలని, సంతానం లేని వారి సంతానం కలగాలని, కుటుంబలో ఐకమత్యం వుండాలని, అనారోగ్యంతో వున్నవారు ఆరోగ్యవంతులు కావాలని, గ్రహదోషాలు, పీడలు తొలగాలని, రాజకీయ పదవీ యోగం కొరకు ఉద్యోగం ప్రమోషన్, గృహ నిర్మాణం, వివాహములు కావాలని, పాడిపంటలు సమృద్ధిగా వుండాలని, మంచి లాభసాటి వ్యాపారులు, దీర్ఘ సుంగళీత్వం, మంచి వివాహ సంబంధములు, ఋణ విమోచనం కావాలని కోరుకొనే వారు అందరూ తల్లీ మేము 5 సంవత్సరములు మీ మండల దీక్ష మాల వేస్తామని మొక్కుబడి మొక్కుకొని అమ్మపాదాలము ఆ మొక్కుబడిని అర్పించి వెళితే ఆ తల్లి మనకు సర్వకాల సర్వావస్థలయందు కొండంత అండగా నిలబడి మన సంకల్పాన్ని నెరవేరుస్తుంది.

శ్రీ అమ్మవారి గర్భగుడి చుట్టూ ప్రధాన దేవతలు, అంతరాలయం చుట్టూ గ్రామ దేవతలు, విమానగోపురం మీద ముక్కోటి దేవతలు, 66 వేల కోట్ల జీవరాశులు, కల్ప వృక్షాలు, సప్త మాతృకలు, అష్టలక్ష్మి, అష్ట దిక్పాలకులు, నవ దుర్గలు, అష్టాదశ శక్తి పీఠమూర్తులు ఇత్యాదిగా వుంటారు. శ్రీ అమ్మవారిని యిక్కడ తప్ప ప్రపంచంలో మరెక్కడా చూడలేము. ప్రస్తుతం మానస సరోవరం చైనా దేశంలో వుంది. శ్రీ అమ్మవారు నిలయం ఉన్న ప్రాంతం మాత్రం భారతదేశంలో వుంది. అక్కడ కూడా అమ్మవారి అతి ప్రాచీన స్వయంభూ విగ్రహం శిథిలమయినదని సిద్ధులమాట. 108 మహా పుణ్యక్షే్త్రముల జీవనదుల్లో, చతుస్సముద్రాల్లో స్నానమాచరిస్తే, ముక్కోటి దేవతల క్షేత్రాలను దర్శిస్తే ఎంతటి పుణ్యఫలమో ఒక్క నంద్యాల క్షేత్రములో వెలిసినటువంటి శ్రీ జగజ్జననీ మాతను దర్శిస్తే అంతటి పుణ్యఫలముతో పాటు జన్మ ధన్యమౌతుంది.

ప్రజలందరూ "ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ జగజ్జనన్యై నమః" అనే మంత్రమును ధ్యానించి అమ్మ ఆశీస్సులు పొందండి.

No comments:

Post a Comment